About Rayala vari Kullur Seema(రాయలవారి కుల్లూరు సీమ గురించి)



కుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరానిసంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండీ ఆరవీటి రాజుల హయాం వరకూ  సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం కొఱకు  సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి. నెల్లూరు సీమ , ఆత్మకూరు సీమ , వెంకటగిరి సీమ , రాపూరు సీమ , కుల్లూరు సీమ  అనేవి మన ప్రాంతానికి చెందిన ' సీమ ' విభాగాలు .

          విజయనగర సామ్రాజ్యాన్ని  ఏలిన  సంగమ సాలువ   వంశాల తదుపరి  తుళువ వంశం అధికారాన్ని చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు  నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు   తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగష్టు 8 న శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి , సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి , అవిఛ్ఛిన్నంగా 1529 వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి , కొండవీడు ,కొండపల్లి , సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు .ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి ,  తన సేనాపతి  రాయసం కొండమరుసయ్యను దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి , కృష్ణాలయం నిర్మించాడు . 1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరు సయ్య సమకాలికుడు , బంధువు , సేనానులలో ఒకడు . నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ , అనంతసాగరం  మండలాలూ , తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ , సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని , ఉదయగిరి దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి , కోటకు ప్రక్కనే నల్లచెఱువును , శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచినాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి , కోటలో ఆశ్విక దళాన్ని ఏర్పాటు చేసి , కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు . అరోజుల్లో , కుల్లూరు పట్టణం  యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం , కలువాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి . విజయనగర రాజుల హయాంలో  ఒక సంవత్సరకాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహర్ణవమి వరకు . సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహర్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి .గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు సాగించేవారు . చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసింహరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయలు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చంద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించినాడు .           వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోని పాండ్యులు తిరుగుబాటు చేసినారు . తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన  రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు పాలించుకొనుటకిచ్చి , పంచపాండియధరావిభాళుండు , సంగ్రామపార్ధుండు , పద్మనాయక వంశాంభోది  చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని సత్కరించినారు .నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని కుల్లూరిసీమ కధిపతిగా నియమించుకొనిరి .

 విజయనగర రాజుల మార్గంలోనే  ,  వెలుగోటి వెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలోప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి ప్రతియేటా తెగి , నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి .  వెంకటవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్టపరచి , తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు నిర్మించినారు . 1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనింగారు  కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి ,సబహుమానంగా గౌరవించి ,  తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలుగునట్లుగా కుల్లూరు నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూడు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒక శిలా శాసనం ఉంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال